Read also:
పౌరసత్వ చట్టం, 2019 గెజిట్ విడుదల
దిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలకు కారణమైన పౌరసత్వ చట్ట సవరణ బిల్లు-2019 చట్టంగా మారింది. గురువారం సాయంత్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దీనిపై ఆమోద ముద్ర వేశారు. ఆ వెంటనే కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ రాజపత్రం(గెజిట్) విడుదల చేసింది. ఈ బిల్లుకు బుధవారం 105 మంది వ్యతిరేకంగా, 120 మంది అనుకూలంగా ఓటు వేయడంతో రాజ్యసభలో గట్టెక్కింది. అదే విధంగా సోమవారం లోక్సభలో 80 మంది వ్యతిరేకంగా 311 మంది మద్దతుగా ఓటేయడంతో సభ ఆమోదం లభించింది. ప్రస్తుతం ఈ బిల్లు చట్టంగా మారడంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లో హింసకు గురై డిసెంబర్ 31, 2014కు ముందు భారత్కు వచ్చిన ముస్లిమేతరులకు నిబంధనల ఆధారంగా ఇక్కడి పౌరసత్వం కల్పించనున్నారు.
మరోవైపు ఈ చట్టంపై అసోం, త్రిపుర, మేఘాలయలో తీవ్ర నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అంతర్జాల సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. రావాణా సౌకర్యం పూర్తిగా స్తంభించిపోయింది. అయితే రాజ్యాంగంలోని షెడ్యూల్ ఆరు కిందికి వచ్చే ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదు.‘బెంగాల్ ఈస్ట్రన్ ఫ్రాంటియర్ రెగ్యూలేషన్ 1773’ ప్రకారం ‘ఇన్నర్ లైన్ పర్మిట్’ కిందకు వచ్చే ప్రాంతాలకు కూడా ఈ చట్టం నుంచి మినహాయింపునిచ్చారు.