Read also:
ఇక పీఎఫ్ తగ్గించుకుని.జీతం పెంచుకోవచ్చా
దిల్లీ: సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులు త్వరలో తాము ఇంటికి తీసుకెళ్లే జీతాన్ని పెంచుకునే వీలు లభించనుందట. అదెలా అంటారా.. వేతనంలో కట్ అయ్యే నెలవారీ ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) వాటాను తగ్గించుకునే అవకాశాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్ సెక్యూరిటీ కోడ్ బిల్లు, 2019కు ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ ద్వారా పొదుపు చేసుకోవచ్చు. నెలనెలా వారి మూల వేతనం(బేసిక్ పే)లో 12శాతం పీఎఫ్ కింద కట్ అవుతుంది. కావాలనుకుంటే దీన్ని పెంచుకునే సదుపాయం కూడా ఉంది. దీనికి మరో 12శాతం సంస్థ వాటా కూడా కలిపి ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. రూ. 15వేల కంటే ఎక్కువ జీతం పొందే ప్రతి ఉద్యోగికి ఈ నిబంధనలు వర్తిస్తాయి.
కాగా ప్రస్తుతం ఉద్యోగి పొదుపు చేసుకునే 12శాతం మొత్తాన్ని ఇకపై తగ్గించుకునే వీలు కల్పిస్తూ నూతన నిబంధనలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగి పీఎఫ్ వాటాను ఎంత శాతం వరకు తగ్గించుకోవచ్చన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. మరోవైపు పీఎఫ్లో సంస్థ ఇచ్చే వాటాలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం.
ఆర్థిక మందగమనం నెలకొన్న నేపథ్యంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచి ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ మార్పుల వల్ల దీర్ఘకాలంలో లేదా పదవీ విరమణ సమయంలో ఉద్యోగి సమస్యలు ఎదుర్కొనే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు పొదుపు తగ్గితే పన్ను మినహాయింపులు కూడా తగ్గే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మరి దీనిపై స్పష్టత రావాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.