Read also:
అమరావతి: రేపు ఉదయం 11 గంటలకు ఏపీ రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. రేపటి సమావేశానికి అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తొలుత సచివాలయంలోనే మంత్రివర్గం భేటీ నిర్వహించాలని భావించినప్పటికీ.. రాజధాని ప్రాంత రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తారా? లేదా సచివాలయంలోనే నిర్వహిస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మంత్రివర్గ భేటీలో మూడు రాజధానుల అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో జీఎన్రావు కమిటీ నివేదికపై చర్చించి, దానిని ఆమోదించే అవకాశముంది. అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్ ప్లాట్ల అంశంపై చర్చించే అవకాశముంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల సమస్యలపైనా చర్చించనున్నట్లు సమాచారం. రాజధాని ప్రాంత రైతుల అభిప్రాయాల సేకరణ కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కర్నూలులో వెటర్నరీ పాలిటెక్నిక్ ఏర్పాటుపై చర్చించనున్నారు. పంటలకు మద్దతు ధర, ఏపీఐసీసీ ద్వారా వివిధ సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశముంది. సీఆర్డీయేలో ఐఏఎస్లు కొన్న ప్లాట్లకు డబ్బులు తిరిగి చెల్లించే అంశంపైనా చర్చించనున్నారు.