Read also:
పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
దిల్లీ: కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లు-2019కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. మెజార్టీ సభ్యులు ఆమోదం తెలపడంతో పౌరసత్వ సవరణ బిల్లు సభలో ఆమోదం పొందినట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఓటింగ్ సమయంలో సభలో 230 మంది సభ్యులు ఉండగా.. బిల్లుకు అనుకూలంగా 125 మంది, వ్యతిరేకంగా 105 మంది ఓటు వేశారు. ఇప్పటికే ఈ బిల్లు లోక్సభలోనూ ఆమోదం పొందిన విషయం తెలిసిందే.
రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆయా సభ్యుల సందేహాలపై వివరణ ఇచ్చారు. ఆ తర్వాత రాజ్యసభ ఛైర్మన్ ఓటింగ్ నిర్వహించారు. అంతకుముందు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలా?వద్దా? అనే అంశంపై ఓటింగ్ నిర్వహించారు. ఈ సమయంలో సభలో మొత్తం 223 మంది సభ్యులు ఉండగా.కమిటీకి పంపొద్దని 124, పంపాలని 99 మంది సభ్యులు ఓటు వేశారు.
ఒకరు ఓటింగ్లో పాల్గొనలేదు. దీంతో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపేందుకు రాజ్యసభ నిరాకరించినట్లు ఛైర్మన్ ప్రకటించారు. అనంతరం బిల్లుపై ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన సవరణ ప్రతిపాదనలు వీగిపోయాయి. సభ్యుల సవరణల్లో కొన్ని మూజువాణి ఓటుతో వీగిపోయినట్లు వెంకయ్యనాయుడు ప్రకటించారు. మరోవైపు ఓటింగ్ సమయంలో సభ నుంచి శివసేన వాకౌట్ చేసింది.