Read also:
కలెక్టరేట్, న్యూస్టుడే: ఉద్యోగ సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యమానికి
సిద్ధమవుతున్నట్లు ఐకాస నాయకులు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక
ఏపీఎన్జీవో భవనంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదార్ల సంయుక్త
కార్యాచరణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకాస జిల్లా నాయకులు
మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా.. ఎన్నికల
ముందు ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చలేకపోయిందన్నారు. సీపీఎస్ రద్దుపై ఈ రోజు
వరకూ ఎటువంటి ప్రయత్నమూ చేయలేదని చెప్పారు. కాలయాపన కమిటీలు వేయబోమని
చెప్పిన ముఖ్యమంత్రి.. మంత్రివర్గ కమిటీ వేయడంలో ఆంతర్యం ఏమిటని
ప్రశ్నించారు. ఇప్పటికీ సదరు కమిటీ ఒక్క సమావేశమూ నిర్వహించకపోవడం
శోచనీయమన్నారు
11వ పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు,
ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఆరోగ్యకార్డుల అమలు, మూడు డీఏల బకాయి
చెల్లింపులు తదితర డిమాండ్లతో దశలవారీగా ఉద్యమానికి సిద్ధమవుతున్నామని
ప్రకటించారు. ఈ నెల 22న ఉద్యోగ, ఉపాధ్యాయులంతా నల్లబ్యాడ్జీలు ధరించి
మధ్యాహ్న భోజన సమయంలో నిరసన చేపడతారని, 29న అన్ని తహసీల్దారు కార్యాలయాల
వద్ద ధర్నా, డిసెంబరు 10న కలెక్టరేట్ వద్ద ధర్నా, అదే నెల 20న
రాష్ట్రస్థాయిలో నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎన్జీవో,
ఏపీటీఎఫ్, యూటీఎఫ్, పింఛనుదార్లు, ఎస్టీయూలకు చెందిన ఐకాస నాయకులు
రమణమూర్తి, బుకారీబాబు, పి.అప్పారావు, ఎన్వీ పైడిరాజు,
బి.జోగినాయుడు,రామరాజు, పైడిరాజు, శ్రీనివాసరావు, రామకృష్ణ, వీఎస్ఆర్
నాయుడు, ఈశ్వరరావు, ఎన్.సురేష్, పి.వి.అమృత, బీవీ కామేశ్వరి తదితరులు
పాల్గొన్నారు.