Read also:
సేవా కేంద్రాల ప్రతినిధుల్లా సైబర్ నేరస్థులు
పలు గ్యాస్ ఏజెన్సీల వివరాల హ్యాకింగ్
అం తర్జాలం ద్వారా గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే ఏజెన్సీ కోసం పరిశోధిస్తున్నారా? అంతర్జాలం ద్వారానే గ్యాస్సిలిండర్ను బుక్ చేస్తున్నారా? జాగ్రత్త.ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీలు, వినియోగదారుల సేవా కేంద్రాల నంబర్లను సైబర్ నేరస్థులు మార్చుతున్నారు. గ్యాస్ సిలిండర్ కావాలంటూ ఫోన్ చేస్తే నేరుగా సైబర్ నేరస్థులు మాట్లాడుతున్నారు. ఇంతే కాదు.. సికింద్రాబాద్లో గ్యాస్ సరఫరాచేసే ఓఏజెన్సీ వెబ్సైట్నే సైబర్ నేరస్థులు హ్యాక్ చేశారు.నెలరోజుల వ్యవధిలో ఈ గ్యాస్ ఏజెన్సీ పరిధిలోని నలుగురు వినియోగదారులను మోసం చేశారు.బాధితులు సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో నాలుగు కేసులు నమోదు చేశారు.ఫిర్యాదిదారులు తెలిపిన సమాచారం ఆధారంగా వారు దిల్లీ కేంద్రంగా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని ప్రాథమికంగా తెలుసుకున్నారు.
అంతర్జాలం ద్వారా సంప్రదిస్తున్న వారిపైనే గురి.
గ్యాస్ సిలిండర్ల సరఫరా పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరస్థులు అంతర్జాలం ద్వారా గ్యాస్ ఏజెన్సీలను సంప్రదిస్తున్నవారినే లక్ష్యంగా చేసుకున్నారు. హైదరాబాద్కు కొత్తగా వస్తున్నవారు, కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకునేవారు అంతర్జాలంలో గ్యాస్ ఏజెన్సీల చిరునామాలు, ఫోన్ నంబర్లను తీసుకుంటున్నారు.వాటికి ఫోన్ చేస్తే సైబర్ నేరస్థులు మాట్లాడుతున్నారు. ఇంటి చిరునామా, బ్యాంక్ ఖాతా,ఆధార్కార్డు వివరాలను తీసుకుంటున్నారు. గూగుల్ పే, పేటీఎం ద్వారా తమ ఏజెన్సీకి నగదు బదిలీ చేస్తే 24 గంటల్లో సిలిండర్ పంపుతున్నామని చెబుతున్నారు. సైబర్ నేరస్థుల మాటలను బాధితులు విశ్వసించి వారు చెప్పినట్టుచేస్తున్నారు. రూ.లక్షల్లో నగదు పోగొట్టుకుంటున్నారు.ఇలా నగదు పోగుట్టుకుంటున్న వారిలో ఎక్కువమంది బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, నారాయణగూడ ప్రాంతాలవారున్నారని సైబర్క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
పద్ధతి మారిదంటూ రూ.లక్ష స్వాహా
విజయవాడలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూ ఇటీవలే బదిలీపై హైదరాబాద్కు వచ్చిన మహిళ సైబర్ నేరస్థుడి మాటలు నమ్మి రూ.లక్ష నష్టపోయింది. వెస్ట్ మారేడ్పల్లిలోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ను అద్దెకు తీసుకున్న ఆమె గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలని తన తల్లికి చెప్పింది. అంతర్జాలంలో గ్యాస్ ఏజెన్సీ వివరాలను తెలుసుకున్న ఆమె తాముంటున్న ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ గ్యాస్ ఏజెన్సీ నంబరు తీసుకుని ఫోన్ చేసింది. పదిరోజులైనా సిలిండర్ రాలేదు. విషయం తెలుసుకుందామని మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ గ్యాస్ ఏజెన్సీ సేవాకేంద్రానికి ఫోన్ చేసింది. బుకింగ్ పద్ధతి మారిందని, రూ.20లు గూగుల్ పే ద్వారా పంపించాలని సైబర్ నేరస్థుడు చెప్పాడు. ఆమె పేరు, బ్యాంక్ ఖాతా అనుసంధానించిన గూగుల్పే నంబర్ తెలుసుకున్నాడు. అనంతరం ఆమెకు ఫోన్ చేసి. 'మీ చరవాణికి సంక్షిప్త సందేశం పంపుతున్నాం... దాన్ని తెరిచి మీ వివరాలు నమోదు చేయండి' అంటూ చెప్పాడు. ఐదు నిముషాల తర్వాత రూ.లక్ష విత్డ్రా అయినట్లు సంక్షిప్త సందేశం వచ్చింది. మోసపోయామని తెలుసుకున్న ఆమె బ్యాంక్ అధికారులకు ఫోన్ చేయగా.పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ సూచించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.