Read also:
స్మార్ట్ఫోన్ వాడుతున్న దాదాపు అందరికీ పేటీఎం గురించి తెలుసు. డిజిటల్ ట్రాన్సాక్షన్లను టీ కొట్టుకు కూడా చేర్చిన ఘనత పేటీఎందే. క్యాష్బ్యాక్లు, ఆఫర్లతో యూజర్లందరినీ ఆకట్టుకుంటున్న పేటీఎంలో ఓ కొత్త తరహా ఫ్రాడ్ ఒకటి వెలుగు చూసింది. ముంబయిలో ఓ వ్యక్తి పేటీఎం వాలెట్లో నుంచి అతని ప్రమేయం లేకుండానే 5,520 రూపాయలు మాయమైపోయాయి. ఏమయ్యాయా అని చూస్తే ఓ జ్యూస్ సెంటర్కు చెందిన పేటీఎం అకౌంట్కు వెళ్లిపోయాయి. పోనీ డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి పెద్దగా చదువుకోని వారేమో.. పొరపాటున ఏదైనా ఆప్షన్ నొక్కితే డబ్బులు పోయాయేమో అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయనో మంచి కంపెనీకి సీఈవో.
ఇంతకీ ఏం జరిగింది
ఒక ప్రముఖ కంపెనీకి సీఈవోగా ఉన్న వికాస్ ఎం సచ్దేవాకు పేటీఎం అకౌంట్ ఉంది. గత మంగళవారం ఉదయం ఆయన ఫోన్ చూసుకునేసరికి ఆయన పేటీఎం వాలెట్లో నుంచి రూ.5,520.93 పైసలు డెబిట్ అయిపోయినట్లు కనిపించింది. అసలు ఈ డబ్బులు ఏమైపోయాయా అని సచ్దేవా పేటీఎం వాలెట్ ట్రాన్సాక్షన్స్ చూస్తే ముందు రోజు రాత్రి 12.13 గంటలకు ఆ అమౌంట్ శ్రీ బాలాజీ జ్యూస్ సెంటర్కు చెందిన పేటీఎం అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయినట్లు కనిపించింది. అంటే వికాస్ నిద్రలో ఉండగానే ఈ ట్రాన్సాక్షన్ జరిగిపోయింది.
తర్వాత ఏం చేశారు
వికాస్ దీన్ని తన ట్విటర్ అకౌంట్లో ట్వీట్ చేశారు. పేటీఎం కస్టమర్ కేర్కు కంప్లయింట్ కూడా చేశారు. దీంతో పేటీఎం వెంటనే ఆ అమౌంట్ను వికాస్ పేటీఎం అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసింది. తన డబ్బులు తనకు తిరిగొచ్చినా అసలు అవి ఎందుకు తనకు తెలియకుండా ట్రాన్స్ఫర్ అయ్యాయని వికాస్ ప్రశ్నిస్తున్నారు.
నిపుణులు ఏమంటున్నారు
మన ప్రమేయం లేకుండా మన పేటీఎం వాలెట్లో నుంచి మనీ వేరేవారికి ట్రాన్స్ఫర్ అయ్యాయన్నది చిన్న విషయం కాదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు. సెక్యూరిటీపరంగా పేటీఎంలో ఉన్న లోపాల్ని ఈ ఇష్యూ ఎత్తి చూపిందంటున్నారు. ఎందుకు మనీ ట్రాన్స్ఫర్ అయ్యాయో సమాధానం చెప్పకుండా పేటీఎం ఆ అమౌంట్ను వికాస్ వాలెట్కు ట్రాన్స్ఫర్ చేయడం సమస్యకు పరిష్కారం కాదంటున్నారుజ. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలని చెబుతున్నారు. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు పరిష్కరించడానికి ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఓ నిపుణుడు అన్నారు.