Read also:
మన బడి నాడు- నేడు’ అమలు ఇలాతల్లిదండ్రుల కమిటీలకు పెద్దపీటరూ.30 లక్షల వరకు పనుల నిర్వహణఆ మొత్తం దాటితే టెండరు విధానం
ముగ్గురు సభ్యులతో
తొలివిడత ఎంపిక చేసిన పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులు, అవసరమైన నిధులను అంచనా వేసే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ విద్యాసంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యూఐడీసీ), సమగ్ర శిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ), గిరిజన సంక్షేమ శాఖలకు అప్పగించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ చివరి దశకు వచ్చింది.
పాఠశాలల్లో పనుల పర్యవేక్షణకు మండల స్థాయిలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తారు. సచివాలయ ఇంజినీరింగ్ సహాయకుల్లో ఇంజినీరింగ్ చదివి కనీసం మూడు సంవత్సరాలపాటు సివిల్ పనుల్లో అనుభవమున్న ఒకరు, సంక్షేమ విద్య సహాయకుడు ఒకరు, ఒక సీఆర్పీ ఇందులో సభ్యులుగా ఉంటారు.
శిక్షణ ఇలా
జిల్లా స్థాయిలో సమగ్ర శిక్ష అభియాన్, ఏపీఈడబ్ల్యూఐడీసీల నుంచి నలుగురు ఇంజినీర్లను ఎంపికచేసి విజయవాడలో ఇటీవల నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి పంపించారు. వారిని మాస్టర్ ట్రైనీలు అంటారు. వీరంతా మండల స్థాయిలో త్రిసభ్య కమిటీలకు శిక్షణ ఇస్తారు. అనంతరం మండల స్థాయి కమిటీలు సచివాలయ స్థాయిలో తల్లిదండ్రుల కమిటీలకు, ఇంజినీరింగ్ సహాయకులకు శిక్షణ ఇవ్వనున్నారు.
మార్గదర్శకాలు
నాడు- నేడు పనులు చేపట్టే ముందు తల్లిదండ్రుల కమిటీ సమావేశమవ్వాలి. ‘పాఠశాల అభివృద్ధి పనులను గుత్తేదారులకు అవకాశం ఇవ్వకుండా మేమే చేసుకుంటాం’ అని ఏకగ్రీవంగా తీర్మానం చేయాలి. పాఠశాలలో నిర్మాణ పనులు, మరమ్మతులకు నిధుల వినియోగంపై తల్లిదండ్రుల కమిటీలు వారానికోసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలి. బ్యాంకులో పాఠశాల పేరున ఇదివరకే ఒక సంయుక్త ఖాతా ఉంటుంది. ఈ ఖాతాకు కలెక్టరు నిధులు విడుదల చేస్తారు. దాతలు విరాళాలు ఇస్తే ఈ ఖాతా ద్వారానే తీసుకోవాలి.
తల్లిదండ్రుల కమిటీలో కనీసం ఆరుగురు సభ్యులు, ప్రధానోపాధ్యాయుడు, సచివాలయ ఇంజినీర్, సైట్ ఇంజినీర్ కలిసి మార్కెట్లో ఇసుక, కంకర, స్టీలు, కిటికీలు, తలుపులు తదితర సామగ్రిని విక్రయించే దుకాణాలను పరిశీలించాలి. ఎక్కడ నాణ్యమైన సామగ్రి లేదా వస్తువులు దొరుకుతాయో అక్కడే కొనుగోలు చేయాలి.
బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలకు సంబంధించిన చెక్కుపై సంతకం చేసేందుకు తల్లిదండ్రుల కమిటీ సభ్యుల్లో అయిదుగురిని ఎంపిక చేయాలి. ప్రభుత్వ ఇంజినీర్, ప్రధానోపాధ్యాయుడు కూడా చెక్కులపై సంతకం పెట్టాలి.
పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ముందస్తుగా పాఠశాల ప్రాజెక్టు అంచనా వ్యయంలో 15 శాతం మొత్తాన్ని తల్లిదండ్రుల కమిటీ బ్యాంకు ఖాతాకు విడుదల చేస్తుంది. దానిలో 80 శాతం ఖర్చు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని తల్లిదండ్రుల కమిటీ తీర్మానం ఆధారంగా విడుదల చేస్తారు. నిధుల విడుదల నిర్మాణ ప్రగతిపై ఆధారపడి ఉంటుంది.