Read also:
ఏ టైమ్ అయితేనేమిటి? ఆరేడు గంటలైతే నిద్రిస్తున్నా కదా అనుకుంటారు చాలా మంది. కానీ, లేటుగా పడుకుని సరిపడా నిద్రించే వారిలో కూడా ఎక్కువ మంది టైప్-2 మధుమేహం, కండరాల క్షీణత వంటి సమస్యల బారిన పడుతున్నట్లు ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం. క్లినికల్ జర్నల్లో ప్రచురితమైన దక్షిణ కొరియా అధ్యయనకారుల వ్యాసం ఒకటి ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. సాధారణ వేళల్లో నిద్రించి మేలుకునే వారితో పోలిస్తే, లేటుగా పడుకుని లేటుగా లేచే వారిలో ఈ సమస్యలు ఉంటున్నాయి. వీరి అధ్యయనం ప్రకారం, మధ్య వయస్కులు, వృద్ధులు అని కాకుండా యువతలో కూడా లేటు నిద్రతో కొవ్వు, ట్రైగ్లిసరైడ్లు పెరగడం వంటి రుగ్మతలు తలెత్తుతున్నాయి.
మొత్తంగా చూస్తే మధుమేహానికి బీజం పడటంతో పాటు, అధిక రక్తపోటు, అధిక షుగర్ నిల్వలు, కొలెస్ట్రాల్ నిల్వలు, గుండె జబ్బులు సమూహంగా వచ్చే మెటబబాలిక్ సిండ్రోమ్, కండరాలు క్షీణించే సార్కోపెనియా వంటి సమస్యలు ఇతరులతో పోలిస్తే వీరిలో 3 రెట్లు అధికంగా తలెత్తుతున్నాయి. అయితే స్త్రీలతో పోలిస్తే ఈ తరహా సమస్యలు పురుషుల్లోనే ఎక్కువ. మరో విషయం ఏమిటంటే, జీవన శైలి విషయంలో నిర్ధిష్టంగా ఉండే వాళ్లు కూడా కేవలం లేటు నిద్రకారణంగానే మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్, కండరాల క్షీణత వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పొగతాగడం, శరీర శ్రమ లేకపోవడం వంటివి కూడా ఉంటే లేటు నిద్రతో వచ్చే సమస్యలు మరింత తీవ్రంగా ఉంటున్నాయని అధ్యయనకారులు చెబుతున్నారు.