Read also:
500 మంది విద్యార్థులుంటే కళాశాల ఈ సామర్థ్యమున్న పాఠశాలలకు అవకాశం
మండలకేంద్రంలో 500మంది కంటే ఎక్కువ విద్యార్థులుండే పాఠశాలను జూనియర్ కళాశాలగా మార్పు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పాఠశాలలు, ఆస్పత్రుల్లో ‘నాడు-నేడు’ కార్యక్రమం కింద కల్పించనున్న మౌలిక వసతులపై మంగళవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈనెల 14న నాడు-నేడు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల పాఠశాలల్లో 3 విడతల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నామన్నారు. పాఠశాలల తర్వాత జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, గురుకుల పాఠశాలలు, వసతిగృహాలను బాగు చేయనున్నామని తెలిపారు. ప్రతి పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని, ఇందులో తల్లిదండ్రుల కమిటీలను భాగస్వాములను చేయాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించే ప్రక్రియను సంక్రాంతినాటికి పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
అందుబాటులో 510 రకాలకుపైనే
510 రకాలకుపైగా మందులను డిసెంబరు 15నుంచి ఆస్పత్రుల్లో అందుబాటులోకి తెస్తామని సీఎం తెలిపారు. డిసెంబరు 26నుంచి ఆస్పత్రుల్లో ‘నాడు-నేడు’ ప్రారంభిస్తామని, మొదటి దశలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రులో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. 230 ఆస్పత్రుల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పనులను న్యాయసమీక్షకు పంపి టెండర్లు ఖరారు చేయాలని ఆదేశించారు.
క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ
క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని సీఎం ఆదేశించారు. తీవ్ర రోగాలతో బాధపడుతున్న వారికి ఇచ్చే పింఛన్ల విషయంలో గ్రామ సచివాలయాలు, వాలంటీర్లను భాగస్వాములను చేయాలన్నారు. డిసెంబరు21 నుంచి ఆరోగ్యకార్డులు జారీ చేయాలని ఆదేశించారు. వచ్చే నెలనాటికి అన్ని ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సుల పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు.