Read also:
భారత రాజకీయ చిత్రపటంలో ఏపీ రాజధాని అమరాతిని చేర్చింది కేంద్రం. అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం కొత్త మ్యాప్ను విడుదల చేసింది. ఇటీవల కేంద్రం విడుదల చేసిన ఇండియా పొలిటికల్ మ్యాప్లో ఏపీ రాజధాని అమరావతి లేకపోవడంపై దుమారం రేగిన విషయం తెలిసిందే. ఐతే ఈ అంశాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో లేవనెత్తారు. భారత చిత్రపటంలో అమరావతికి స్థానం కల్పించకపోడంతో ఏపీ ప్రజలకే కాదు. ప్రధాని మోదీకి కూడా అవమానమని వ్యాఖ్యానించారు. అమరావతి మిస్సింగ్ అంశం రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశముందని అభిప్రాయపడ్డారు జయదేవ్. ఆయన లోక్సభలో లేవనెత్తిన మరుసటి రోజే కేంద్రం కొత్త మ్యాప్ను విడుదల చేయడం గమనార్హం.
ఇండియా మ్యాప్లో అమరావతి
జమ్మూ కాశ్మీర్, లడఖ్లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత కేంద్రం అక్టోబరు 21న భారతదేశ పొలిటికల్ మ్యాప్ను విడుదల చేసింది. ఇందులో 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఐతే మ్యాప్లో ఆంధ్రప్రదేశ్కు రాజధాని పేరు లేకపోవడం గమనార్హం.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాజధానిని చేర్చిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీ రాజధాని అమరావతిని మాత్రం చేర్చలేదు. దీంతో మ్యాప్ చూసిన తెలుగు ప్రజలు షాక్ తిన్నారు. ఏపీ రాజధాని పేరు లేకపోవడం ఏంటని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.