Read also:
గ్రామ, వార్డ్ సచివాలయ అభ్యర్థులకు గ్రేస్ మార్కులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించి మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. కానీ చాలా జిల్లాలలో ఎక్కువ మంది అభ్యర్థులు కటాఫ్ మార్కులు సాధించకపోవటంతో పోస్టులు మిగిలిపోయాయి. కొన్ని రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో మిగిలిన పోస్టులకు కటాఫ్ మార్కులను తగ్గించింది.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలు రాసిన అభ్యర్థులందరికీ 15 మార్కుల చొప్పున గ్రేస్ మార్కులను కలపాలని నిర్ణయం తీసుకుంది. గ్రేస్ మార్కులు కలిపిన తరువాత గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన వారి జాబితా తయారు చేసి ధ్రువపత్రాల పరీశీలన చేయబోతున్నట్లు సమాచారం.1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల్లో ఇప్పటివరకు 40,000కు పైగా ఉద్యోగాలు భర్తీ కాలేదు.
పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ నిన్న 13 జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లతో సచివాలయాల్లో మిగిలిన ఖాళీలు, గ్రేస్ మార్కుల గురించి చర్చించినట్లు సమాచారం. గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలు రాసిన అభ్యర్థులకు గ్రేస్ మార్కులు కలిపితే గ్రామ, వార్డ్ సచివాలయాల్లో మిగిలిన ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది.
కొన్ని రోజుల క్రితం గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల ఖాళీలను ఓసీ, బీసీ కటాఫ్ మార్కులు 5 నుండి 10 శాతం వరకు తగ్గించి భర్తీ చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ప్రభుత్వం గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలు రాసిన అభ్యర్థులకు అదనపు మార్కులను కలిపి ఖాళీలను భర్తీ చేయబోతుంది. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికై విధుల్లో చేరిన వారు ప్రస్తుతం శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జనవరి నెల నుండి గ్రామ, వార్డ్ సచివాలయాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.