Read also:
Funds for school management are mandated to prioritize sports
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం కల్పిస్తూ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక అవసరాలు తీర్చుకునేందుకు అనువుగా ప్రతి బడికీ నిర్వహణ నిధులను విడుదల చేసింది. వీటితో విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలతో పాటు వ్యాయామ విద్యకు కావాల్సిన క్రీడా సామగ్రిని సమకూర్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
గతంలో పాఠశాల నిర్వహణకు కొంత మొత్తం నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా, ఆర్థిక సంఘం ఆమోదం లేక పలు పాఠశాలలకు అవి చేరలేదు. కొన్ని పాఠశాలల్లో సగం అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్య 15మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలల నిర్వహణకు కనీస మొత్తం నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. వచ్చిన వాటిలో క్రీడలకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు పలు అడ్డంకులు ఉండటంతో మిగిలిన అవసరాలకు వీటిని వినియోగించారు. పలు బడుల్లో ఉపాధ్యాయులు క్రీడా పరికరాల కొనుగోలుకు దాతలపై ఆధారపడగా, మరికొన్నిచోట్ల క్రీడా పరికరాలు లేక వ్యాయామ విద్య మిథ్యగా మారింది. జిల్లాలోని జడ్పీ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల నుంచే నిధులు వసూలు చేసి, క్రీడా పరికరాలు కొనుగోలు చేశారు. ఇవీ చాలని పరిస్థితి ఎదురైతే అరకొర సామగ్రితోనే సర్దుకున్నారు.
ఇప్పటి ఆదేశాలు ఇలా
ప్రతి పాఠశాలకూ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీటి ఆధారంగా పాఠశాల నిర్వహణ కమిటీ సమావేశంలో ప్రధానోపాధ్యాయుడి సమక్షంలో విద్యార్థుల అవసరాలు తెలుసుకుని, వాటికి ఈ నిధులను వెచ్చించాల్సి ఉంది. వీటిలో కొంత భాగం తప్పనిసరిగా క్రీడాసామగ్రి కొనుగోలుకు ఖర్చు చేయాలని నిబంధన విధించారు. మంజూరైన మొత్తంలో తప్పనిసరిగా పదిశాతం నిధులు బడి ప్రాంగణ పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి, స్వచ్ఛభారత్ కార్యక్రమానికి కేటాయించాలని సూచించారు. ఈ కింది అవసరాలకు వీటిని ఖర్చు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు.జాతీయ పండగలు, దినోత్సవాల నిర్వహణ
క్రీడా పరికరాల కొనుగోలు, మరుగుదొడ్ల నిర్వహణ, చిన్నపాటి మరమ్మతులు
విద్యుత్, అంతర్జాల బిల్లుల చెల్లింపు
తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ
యాజమాన్య కమిటీ సమావేశాల నిర్వహణ
10శాతం నిధులు తప్పనిసరిగా స్వచ్ఛభారత్ అమలుకు
విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఏడాదికి పాఠశాలలకు మంజూరు చేసే నిధులు -పిల్లలు -నిధులు(రూపాయల్లో)
➤15మందిలోపు --12,500➤16 నుంచి 100 మంది -- 25 వేలు
➤100 నుంచి 250 మంది -- 50 వేలు
➤250మందికి మించి ఉంటే -- 75 వేలు.