Read also:
ఐదేళ్లలో రాష్ట్రంలోని 44వేల పాఠశాలలు, కళాశాల భవనాల రూపురేఖలు మార్చాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలంటే ఇంజినీర్లు ఉద్యమంలా పని చేయాలని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పిలుపునిచ్చారు. కడప జెడ్పీ కార్యాలయంలో కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన విద్యాశాఖ ఇంజినీర్లతో ఆయన సమావేశం నిర్వహించారు.
చాలా చోట్ల పాఠశాల భవనాలు 18 ఏళ్లు కూడా పూర్తి కాకుండానే కూలడానికి సిద్ధంగా ఉన్నాయని, నాణ్యత ప్రమాణాలు ఇంజినీరింగ్ అధికారులు ఎందుకు పాటించలేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలని మంత్రి హితవు పలికారు.
గతంలో జరిగిన పనులపై తాను ప్రశ్నించడం లేదని, వైకాపా పాలనలో అంతా పారదర్శకంగా జరగాలని ఆయన గుర్తు చేశారు. అవినీతికి తావులేకుండా రాష్ట్రంలోని పాఠశాలల, కళాశాలల భవనాల రూపురేఖలు మారబోతున్నాయని ఆయన తెలిపారు. ఇప్పుడున్న పాత పాఠశాల భవనాలు ఫోటోలు తీసి మూడేళ్లలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రజలకు చూపించాలని ఆయన కోరారు. ఐదేళ్లలో విద్యాశాఖలో సమూల మార్పులు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని, ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం లేకుండా అధికారులు పనులు చేయాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.