Read also:
పరిమితికి మించి ఉన్న బంగారం వివరాలను స్వచ్ఛందంగా తెలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ పథకం తీసుకొస్తున్నట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు స్పందించారు. ఈ విషయంలో మీడియాలో వచ్చిన కథనాలను కొట్టిపారేశారు. బంగారం విషయంలో ‘స్వచ్ఛంద వెల్లడి’ లాంటి పథకాలను తీసుకొచ్చే ప్రతిపాదనేదీ లేదని తేల్చి చెప్పారు. బడ్జెట్ తయారీ సమయంలో ఇలాంటి వార్తలు రావడం సహజమేనని తెలిపారు.
కాగా. పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్ల ధనాన్ని బంగారం రూపంలోకి మార్చడం ఎక్కువయిందని కేంద్రం భావిస్తోందంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని కూడా బయటపెట్టేందుకు బంగారం ‘స్వచ్ఛంద వెల్లడి’ పథకాన్ని కేంద్రం ప్రవేశ పెట్టబోతోందంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఈ పథకం ప్రకారం ప్రతి ఒక్కరూ తమ వద్ద నిల్వ ఉన్న బంగారం వివరాలను బయటపెట్టాల్సి ఉంటుందనీ. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే వెల్లడిస్తారంటూ కథనాలు వెలువడ్డాయి.పరిమితికి మించి ఉన్న బంగారం నిల్వలపై పన్ను విధించి ‘అమెస్టీ’(క్షమాభిక్ష) కింద శిక్షించకుండా వదిలేస్తుందని కూడా మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో స్పందించిన అధికారులు అలాంటి ప్రతిపాదనేదీ లేదని వివరించారు.