Read also:
దేశ ప్రజల కదలికలపై కేంద్రం నిఘా.త్వరలో పట్టాలెక్కనున్న 3400 కోట్ల ప్రాజెక్టు
ఎన్ఏటీ గ్రిడ్.. దాన్నే నాట్ గ్రిడ్ అని కూడా అనొచ్చు. అంటే... నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అన్నమాట. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా 3400 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ఇంతకీ దీని వల్ల ఏంటి ఉపయోగం అంటారా? పదండి.. కాస్త వివరంగా తెలుసుకుందాం. మీకు 26/11 ముంబై టెర్రర్ అటాక్ గుర్తుంది కదా. చాలా ఘోరమైన ఘటన అది. అటువంటి దాడులు మళ్లీ జరగకూడదు.. అనే సదుద్దేశంతో పట్టాలెక్కిన ప్రాజెక్టే నాట్ గ్రిడ్.
ఇది ఒక ఇంటెలిజెన్స్. ఇది దేశంలోని ప్రజలపై ఓ కన్నేస్తుంది. అంటే... ఇమ్మిగ్రేషన్ వ్యక్తులను, బ్యాంకింగ్ కు సంబంధించిన వాళ్లపై, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులపై, రైలు ప్రయాణికులపై, విమాన ప్రయాణికులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఆ డేటా ఆధారంగా దేశ ప్రజల కదలికలను ట్రాక్ చేస్తుంది.
దేశంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నా, దాడులు జరిగే ప్రమాదం ఉన్నా.. నాట్ గ్రిడ్ దగ్గర ఉన్న రియల్ టైమ్ డేటా ద్వారా ట్రాక్ చేస్తుంది. అయితే.. ఈ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలకెక్కలేదు. 2020 జనవరిలో ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రాజెక్టులో ఇమ్మిగ్రేషన్, బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలు, క్రెడిట్ కార్డ్ డేటా, టెలికాం, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, విమాన ప్రయాణికులు, రైలు ప్రయాణికులు.. లాంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. మొదటి దశలో 10 యూజర్ ఏజెన్సీలు, 21 సర్వీస్ ప్రొవైడర్లు నాట్ గ్రిడ్ తో అనుసంధానం కానున్నారు.