Read also:
సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు : చూపాల్సిన సర్టిఫికెట్ల వివరాలు
ఏపీలో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫలితాలు గురువారం (సెప్టెంబర్ 19) విడుదలైన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు 19 లక్షల 50వేల 630 మంది అభ్యర్థులు హాజరుకాగా.. లక్షా 98వేల 164 మంది అర్హత సాధించారు. లక్షా 26 వేల 728 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపిస్తున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం(సెప్టెంబర్ 23, 2019) నుంచి 3 రోజుల పాటు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. కాగా, సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించి అభ్యర్థులకు అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. ఏ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలి అనేదానిపై సందేహాలు ఉన్నాయి. వారి డౌట్లకు అధికారులు క్లారిటీ ఇచ్చారు. అభ్యర్థులు తమ వెంట తీసుకురావాల్సిన సర్టిఫికెట్ల వివరాలు తెలియజేశారు. సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు వెరిఫికేషన్ సమయంలో అధికారులకు చూపాల్సిన సర్టిఫికెట్ల వివరాలు వెల్లడించారు.
వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు అధికారులకు చూపాల్సిన సర్టిఫికెట్ల వివరాలు ఇవే:
* అభ్యర్థి ఆన్లైన్లో దరఖాస్తు చేశాక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న పత్రం.*SSC సర్టిఫికెట్ లేదా బర్త్ సర్టిఫికెట్.
* ఒరిజనల్ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు.
* 4వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య ఎక్కడ చదివారన్న వివరాలతో స్టడీ సర్టిఫికెట్లు.
* స్కూల్, కాలేజీల్లో చదవకుండా డైరెక్ట్ డిగ్రీ వంటి కోర్సులు చేసిన వారి నివాస ధ్రువీకరణ పత్రం.
* రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ నోటిఫికేషన్ మేరకు తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి స్థానికత మార్చుకున్నప్పుడు సంబంధిత అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్.
* చెవిటి, మూగ వైకల్యంతో ప్రత్యేక స్కూళ్లలో చదువుకున్న వారు.. వారి తల్లిదండ్రుల నివాసిత ధ్రువీకరణ పత్రం.
* బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం.
* బీసీ అభ్యర్థులు తాజాగా తహసీల్దార్ జారీ చేసిన నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్.
* దివ్యాంగ అభ్యర్థులు సదరం క్యాంపుల ద్వారా పొందిన మెడికల్ సర్టిఫికెట్.
* ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ వెయిటేజీ పొంది.. ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారు తమ శాఖాధిపతి నుంచి పొందిన ఇన్ సర్వీసు సర్టిఫికెట్.
* తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీ. దీనికి సంబంధించిన నిర్ణీత ఫార్మాట్ను వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలి.
అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా 788 గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో ప్రారంభంకానున్న 788 సచివాలయాల్లో.. మండలానికి ఒకటి చొప్పున 678 పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఒక్కో వార్డు చొప్పున 110 సచివాలయాలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు రాత పరీక్షలు నిర్వహించింది. లక్షా 26వేల 728 ఉద్యోగాలకు 21లక్షల 69వేల 814 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 19.50 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.