Read also:
విజయనగరం పట్టణం భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉంది. ఇది విజయనగరం జిల్లాకు ముఖ్యపట్టణం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. 1979 జూన్ 1 న ఈ జిల్లా ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం బంగాళా ఖాతము నుండి 18 కి.మీ.ల దూరములో, విశాఖపట్నం నకు 40 కి.మీ.లు ఈశాన్యమున ఉంది.
చరిత్ర
విజయనగరం పట్టణం చారిత్రక ప్రశస్తి కలిగినది.ప్రపంచప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకంలోని ప్రధాన వేదిక విజయనగరమే! పట్టణంలోని కొన్ని ప్రధాన ప్రాంతాలు- అయ్యకోనేరు, బొంకులదిబ్బ మొదలైన వాటి ప్రస్తావన ఈ నాటకంలో ఉంది. ఆ నాటక రచయిత గురజాడ అప్పారావు విజయనగరం రాజావారి ఆస్థానంలో ఉద్యోగస్తుడే.
పైడితల్లి అమ్మవారి ఆలయం
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు విజయనగరం పట్టణంలో 300 ఏళ్లుగా జరుగుతున్నాయి.బొబ్బిలియుద్ధం సమయంలో విజయనగర రాజుల ఆడపడుచైన పైడితల్లి ఆత్మాహుతికి పాల్పడి ఇలవేల్పుగా అవతరించినట్లు భావిస్తారు. అప్పటినుంచి ఆమెను భక్తితో పూజిస్తున్నారు. లక్షలాదిమంది భక్తులు దీనికి హాజరవుతారు.
pydithallamma-thalli |
విజయనగరం పట్టణం మధ్యలో 'పెద్ద చెరువు' చాలా విశాలమైనది. 18వ శతాబ్దంలో కోట నిర్మాణానికి కావల్సిన మట్టి కోసం దీన్ని తవ్వించారు. ఈ చెరువులోని నీటితో ఆయకట్టు రైతులు ఏటా మూడు పంటలు పండిస్తుంటారు. ఈ చెరువు పశ్చిమ భాగంలోనే పైడిమాంబ విగ్రహం సాక్షాత్కారమైనది. ఈ చెరువులోనే అమ్మవారి తెప్పోత్సవం నిర్వహిస్తారు.
గంట స్తంభం కూడలి
విద్యుచ్చక్తి లేని రోజుల్లో నాటి పురపాలక సంఘం వారు మూడు లాంతర్లు కూడలిలో మూడు వైపులా మూడు హరికెన్ లాంతర్లు ఏర్పాటుచేశారు. రాత్రిపూట నెల్లిమర్ల, ధర్మపురి, గంటస్తంభం దారులలో ఎడ్లబళ్ళుతో వెళ్ళేవారికి, పాదచారుల సౌకర్యార్ధం నెలకొల్పారు.
viziayanagaram-ganta-sthambam |
విజయనగర రాజులు అవృతఖానాను పెద్ద పూలకోటలో నిర్మించారు. ఖానా అంటే మదుము అని అవృత అనే ఆంగ్లపదంతో కలిసి రూపొందింది. నీరు బయటకు పోయే మదుము అని దీని అర్ధం. ఇది గంటస్తంభం నమూనాలో ఉంది.పైభాగంలో స్నానానికి అనువుగా పెద్ద తొట్టె ఉంది. క్రిందిభాగంలో నుయ్యి, దిగడానికి మెట్లు ఉన్నాయి. మహారాజులు ఇందులో స్నానాలు చేసేవారని పెద్దలు అంటారు.
రాజావారి కోట
కోట ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని బొంకుల దిబ్బ అంటారు. నాడు ఈ ప్రదేశాన్ని మహారాజులు సైనిక విన్యాసాలకు కవాతులకు వినియోగించేవారు. బంకు అనేది మహారాష్ట్ర పదం దీనికి తలవాకిట పహరా అని అర్ధం. కాలక్రమేణా ఈ బంకులదిబ్బే బొంకులదిబ్బగా రూపాంతరం చెందింది.
Vizianagaram_kota |
ఈ ప్రదేశానికి ఈ పేరు రావడానికి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఒక ఫ్రెంచి ఇంజినీరు భూగర్భ జలాల్ని బయటకు తెప్పిస్తానని గొట్టాలను తెప్పించి వాటిని ఇక్కడే భూమిలోకి దించాడట. తన ప్రయత్నం విఫలం కావడంతో చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రే పారిపోయాడట. ఆ ఇంజినీరు పలికిన బొంకు లేదా అబద్ధం ఆ ప్రదేశానికి స్థిరపడిందంటారు. మహాకవి గురజాడ అప్పారావు తన కన్యాశుల్కం నాటకాన్ని బొంకుల దిబ్బ సీనుతోనే ఆరంభించారు. ప్రస్తుతం ఈ ప్రదేశం కూరగాయల మార్కెట్ గా ఉపయోగపడుతుంది.
చరిత్ర
విజయనగరం ఒక సంస్థానం. పూసపాటి వంశం వారు దీని పాలకులు. 1754 లో, విజయనగర పాలకుడైన పూసపాటి విజయరామ గజపతి రాజు, ఫ్రెంచి వారితో ఒప్పందం కుదుర్చుకొని, తన పాలన సాగించాడు. కానీ కొంత కాలానికే ఈ సంస్థానం బ్రిటిషు వారి ఏలుబడిలోకి వెళ్ళింది. స్వాతంత్ర్యం వచ్చేవరకు బ్రిటిషువారి ఏలుబడిలోనే ఉంది.
విజయనగరం కోట
విజయనగర రాజులు మొదట్లో కుమిలి లోని మట్టి కోటలో నివసించేవారు. ఆనంద గజపతి రాజు విజయనగరం కోట నిర్మాణాన్ని క్రీ.శ. 1712-1714 ల మధ్య ప్రారంభించారు. అయిదు విజయాలకు చిహ్నంగా అనగా విజయ నామ సంవత్సరంలో, విజయదశమి, మంగళవారం నాడు (తెలుగులో జయవారం) ఈ కోట నిర్మాణం మొదలైంది. తన కుమారుడు విజయరామ రాజు పేరిట దీనికి 'విజయనగరం' అని పేరు వచ్చింది. అయితే 1717 సంవత్సరంలో ఆనందరాజు పరమపదించగఅ విజయరామరాజు కోట నిర్మాణాన్ని పూర్తిచేశారు.2012 నాటికి 300 సం. అయ్యాయి.
విజయనగరం కోటను కొండరాళ్లతో నిర్మించారు. ఇది 26 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు కోణాల్లో నలుగు పెద్ద బురుజులతో నిర్మితమైనది. కోట చుట్టూ 19,653 చదరపు అడుగుల కందకం తవ్వించారు. నాడు కందకం నిండా నీరు ఉండేది. ఇది సుమారు రెండు ఏనుగులు మునిగేటంత లోతు ఉంటుంది. గోడలు సుమారు 30 అడుగుల ఎత్తు కలిగివున్నాయి.
ప్రముఖులు
- పి.సుశీల
- ఇందుకూరి రామకృష్ణంరాజు
- భమిడిపాటి రామగోపాలం: ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. ఆయన బి.ఎ. వరకు విద్యాభ్యాసాన్ని విజయనగరంలో పూర్తిచేసుకున్నారు.
- వి.రామకృష్ణ
- ద్వివేదుల విశాలాక్షి
- శ్రీరంగం నారాయణబాబు
- నిడుదవోలు వేంకటరావు
- న్యాయపతి కామేశ్వరి
- వంకాయల నరసింహం
- కొచ్చెర్లకోట రంగధామరావు: స్పెక్ట్రోస్కోపీ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన భౌతిక శాస్త్రవేత్త.
- మానాప్రగడ శేషసాయి
- తనికెల్ల కల్యాణి
- పంతుల జోగారావు—కథా రచయిత
- పి.వి.బి.శ్రీరామ మూర్తి - కథా నవలా రచయిత
- కె.కె.రఘునందన - కథా రాచయిత
- కె.కె.భాగ్యశ్రీ - కథా, నవలా రచయిత్రి
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు—బాల కథా, నవలా రచయిత
- గవిడి శ్రీనివాస్.