Read also:
దసరా సెలవుల్లో కుదరదన్న అధికారులు
అయినా.. షెడ్యూల్ కోసం టీచర్ల వెయిటింగ్
ఉపాధ్యాయ బదిలీలు ఇప్పట్లో జరిగే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. ఈ నెలాఖరులో వచ్చే దసరా సెలవుల్లో బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నా.. ఆ సమయంలో చేపట్టలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జనాభా గణన(సెన్సెస్) ప్రారంభం కానున్న దృష్ట్యా 2020-21 విద్యా సంవత్సరంలోనూ ఉపాధ్యాయ బదిలీలు ఉండవనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదేవిషయాన్ని విద్యాశాఖ అధికారులు కూడా పేర్కొంటున్నారు
పాఠశాలలకు ఈ నెలాఖరు నుంచి దసరా సెలవులు ఉన్నందున, ఆ సమయంలో ఆన్లైన్లో బదిలీలు చేపడితే ఇబ్బంది లేకుండా ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వానికి, పాఠశాల విద్యా కమిషనరేట్కు తెలిపాయి. పలువురు ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు స్వయంగా సీఎం జగన్కి విజ్ఞప్తి కూడా చేశారు. ఇప్పుడు చేపట్టకుంటే ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలు, నష్టాలను కూడా వివరించారు. అయితే, దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం. అదేసమయంలో టీచర్ల బదిలీలు అనుకున్నంత సులభం కాదని, కనీసం 30 నుంచి 45 రోజుల సమయం పడుతుందని అంటున్నారు.
ఇప్పటికైనా చేపట్టాలి: టీచర్లు
వచ్చే దసరా సెలవుల్లో బదిలీలు చేపట్టాలని టీచర్లు కోరుతున్నారు. డీఎస్సీ-2018కి సంబంధించి కొత్త టీచర్లు ఈ నెలాఖరులో పాఠశాలల్లో చేరనున్నారు. ప్రస్తుతం బదిలీలు జరగకుంటే ఎనిమిదేళ్లుగా మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న టీచర్లు ఇప్పటికీ అక్కడే మరి కొంతకాలం పనిచేయాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020లో సెన్సెస్ కార్యక్రమంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర. 2021లో చేపట్టే పరిశీలనలోనూ వారి భాగస్వామ్యం తప్పనిసరి. దీంతో ఇప్పటికైనా తమ బదిలీలపై అధికారులు దృష్టి పెట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి