Friday, August 23, 2019

గుర్రం ఎక్కి వచ్చి పాఠం చెప్పే మాస్టారు ఎంత కష్టమైనా , ఇష్టంగానే వచ్చి పాఠాలు చెబుతున్నారు



Read also:

గుర్రమెక్కే మా సారు ! మృగాలదారిలో నడిచొచ్చే మాస్టారు బడిబాటలో ఇద్దరు టీచర్ల ఆదర్శం కుండపోత పడినా గుర్రమెక్కి బడికి ప్రాణాలకు తెగించి పిల్లలకు పాఠం తాము కష్టపడుతూ ఏజెన్సీ పిల్లలకి ఇష్టంగా విద్యాబోధన చేస్తున్న వైనం వారిద్దరూ ఆదివాసీ ఉపాధ్యాయులే . . ఏజెన్సీ ప్రాంతంలో టీచర్ కొలువు అంటే ఏదో వంక పెట్టి డుమ్మా కొట్టేవారే ఎక్కువ . ఉండే వసతి నుంచి , బడికి వెళ్లే దారి దాకా ప్రతిదీ గండమే . ఈ బాధలు పడలేకే కొంతమంది టీచర్లు తమకు బదులుగా పనిచేయడానికి స్థానికంగా కాస్త చదువుకొన్న యువకులను బడిలో పెట్టి , తమకొచ్చే జీతంలోంచి కొంత వారికి చెల్లిస్తుంటారు . సాధారణంగా విశాఖ మన్యంలో బడులు పరిస్థితి ఇలాగే ఉంటుంది . అయితే , ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రం ప్రాణాలకు తెగించి మరీ పాఠశాలకు చేరుకొని పాఠాలు చెబుతున్నారు . రహదారి సరిగా లేని పాఠశాలకు ఒకరు గుర్రంపై వస్తుండగా , అడవి జంతువులు తిరిగే మార్గంలో కాలినడకన మరో టీచరు పాఠశాలకు వచ్చి వెళుతున్నారు . ఆదివాసీలుగా పుట్టి , తమ తోటివారిని అక్షరాస్యులను చేయాలనే వారి తపన అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది . జి . మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ సుర్లపాలెం ప్రాథమిక పాఠశాలలో గంపరాయి వెంకటరమణ టీచరుగా పనిచేస్తున్నారు . మూడు నెలల క్రితమే ఆయన బదిలీపై వచ్చారు . రోజూ గుర్రంపై ప్రయాణం చేసి వెంకటరమణ బడికి వచ్చిపోతున్నారు . నిజానికి , ఆయన గతంలో కాలినడకనే కొండలు మిట్టలు దాటుకొని విధులకు హాజరయ్యేవారు . కుండపోతగా వానలు పడిన రోజు కూడా పిల్లలకు పాఠాలు చెప్పడం మానలేదు . ఆయన ఉంటున్న గెమ్మెలి నుంచి పాఠాలు చెప్పే సుర్లపాలెం నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది . 
వాహన వసతి లేదు . వానలు పడితే అస్సలు ఆ దారిలో పోవడం సాధ్యం కాదు . అలాంటి రోజుల్లోనూ , బురదలోనే రోజూ రానూపోనూ ఎనిమిది కిలోమీటర్లు నడిచేవారు . తమ పిల్లలకు చక్కగా పాఠాలు చెబుతున్న టీచరు అవస్థను చూసిన ఆ ఊరి జనం ఆయనకు ఒక గుర్రాన్ని ఇచ్చారు . ' గుర్రమెక్కే మా సారు ' అంటూ ఆయనను చూసి విద్యార్థులు మురిసిపోతుంటారు . ఆయన పాఠశాలలో 44 మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు . ఈ గ్రామానికి పాఠశాల మంజూరుచేసిన ప్రభుత్వం భవన సౌకర్యం మాత్రం కల్పించలేదు . ప్రస్తుతం గ్రామ శివార్లోని చర్చిలో తరగతులు నిర్వహిస్తున్నారు . మృగాల భయంతో రేడియో పెట్టుకొని . . జి . మాడుగుల మండలంలోనే వంతాల పంచాయతీ వంతలమామిడి ప్రాథమిక పాఠశాలలో కొటారి వలసయ్య పాఠాలు చెబుతున్నారు . ఆయన రోజూ కాలినడకనే పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నారు . వలసయ్య ఉంటున్న జి . మాడుగుల నుంచి వంతలమామిడి గ్రామానికి 43 కి . మీ . దూరం ఉంది . వలసయ్య తియ్యమామిడి వరకు , అంటే 40 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై వస్తారు . అక్కడి నుంచి అడవిలో మూడు కి . మీ . నడిచి వంతలమామిడి చేరుకొంటారు . ఎప్పుడు ఏ జంతువు మీద పడుతుందో తెలియదుకాబట్టి , వాటిని భయపెట్టడానికి ఈ ప్రయాణమంతా రేడియో ఆన్ చేసి ఉంచుతారు . వలసయ్య పాఠాలు చెప్పే బడిలో 30 మంది విద్యార్థులు ఉన్నారు . బడికి భవనం లేకపోవడంతో వలసయ్య తానే స్వయంగా రూ . 20 వేలు వెచ్చించి , గ్రామస్థులతో శ్రమదానం చేయించి రేకుల షెడ్డు వేయించారు . ఆయన ప్రోత్సాహంతో గ్రామస్థులు మట్టి తవ్వి ఇటీవలే కాలిబాట నిర్మించుకొన్నారు . ఇదంతా ఎలా చేయగలుగుతున్నారని అడిగితే“ విద్యార్థులకు విద్యనందించడం నా బాధ్యత . అందుకే ఈ గ్రామానికి చేరుకోవడం ఎంత కష్టమైనా , ఇష్టంగానే వచ్చి పాఠాలు చెబుతున్నాను " అని వలసయ్య తెలిపారు .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :