Read also:
Ready to launch chnandrayaan2 at 2.43
మధ్యాహ్నం నింగిలోకి దూసుకెళ్లనున్న రాకెట్.. చంద్రుడి పైకి భారత్ ప్రయోగించబోతున్న రెండో ప్రతిష్టాత్మక ఉపగ్రహం చంద్రయాన్-2 సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 2.43 గంటలకు లాంచ్ కానుంది. జీఎస్ఎల్ వీ-మార్క్3ఎం1 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లనుంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జరిగే ఈ ప్రయోగానికి ఆదివారం సాయంత్రం 6.43 గంటల నుంచే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 3.8 టన్నుల బరువు గల చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లే జీఎస్ఎల్ వీ రాకెట్.. 16.13 నిమిషాల పాటు ప్రయాణించి నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.
ఆ తర్వాత చంద్రయాన్-2 ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోతుంది. ఈ నెల 15వ తేదీనే చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టాలని ఇస్రో అధికారులు సిద్ధమైనప్పటికీ.. క్రయోజనిక్ ట్యాంకర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యల రీత్యా వాయిదాపడిన సంగతి తెలిసిందే. కాగా, చంద్రయాన్-2 ప్రయోగం వాయిదా పడినప్పటికీ.. ముందుగా అనుకున్న సెప్టెంబర్ 6వ తేదీనే ఉపగ్రహం నుంచి ల్యాండర్,రోవర్ విడివడి చంద్రుడిపై అడుగుపెట్టనున్నాయి. అయితే భూమి కక్ష్యలో ఉపగ్రహం సంచరించే గడువులో మాత్రం మార్పు ఉండనుంది. ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం లాంచ్ జరిగి ఉంటే.. భూకక్ష్యలో ఉపగ్రహం 23 రోజులు ప్రయాణించి ఉండేది. సవరించిన షెడ్యూల్ ప్రకారం 17 రోజులు మాత్రమే భూకక్ష్యలో పయనించనుంది. చంద్రుడిపై రోవర్ ల్యాండ్ అయిన తర్వాత సెకనుకు సెంటీమీటరు వేగంతో 14 రోజుల పాటు ప్రయాణిస్తుంది. అక్కడి ఉపరితలంపై ఉన్న పదార్థాల ఛాయచిత్రాలను అది చేరవేస్తుంది. చంద్రయాన్-1 ప్రయోగం విజయవంతమైన 11 ఏళ్ల తర్వాత చేపడుతున్న చంద్రయాన్-2 ప్రయోగంపై ఇస్రో శాస్త్రవేత్తలు ధీమాతో ఉన్నారు.